ఆదికవి నన్నయ యూనివర్సిటీ లో అలరించిన ఉగాది జాతీయ కవి సమ్మేళనం
శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త నిర్వహణలో కవులకు సన్మానం
.
ఆదికవి నన్నయ యూనివర్సిటీ మరియు శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లవనామ సంవత్సర ఉగాది జాతీయ కవి సమ్మేళనం అలరించింది . పలువురు కవులు కరోనా పై కవితాగానం చేశారు . ఈ కార్యక్రమానికి ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మొక్కా జగన్నాధరావు ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ కవులు సామాజిక అంశాలపై కవిత్వం రాయాలన్నారు . అదే విధంగా మనం ఏది చెప్పదలచుకున్నామో అది ముందుగా మనం పాటించాలన్నారు .. ఈ సందర్భంగా
కవులందరిని ఉపకులపతి జగన్నాధరావు అభినందించారు .
యూనివర్సిటీ పరిధిలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ హాలు నందు ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి డాక్టర్ తరపట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీ శ్రీ కళావేదిక ఛైర్మెన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ కవులు నేటి ప్రకృతి విపత్కర పరిస్థితులపై కవిత్వాన్ని రాయాలన్నారు . కరోనా పై ప్రజల్లో అవగాహన కలిపించే చైతన్యపూరిత రచనలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు .
జన జీవితాలను దగ్గరనుండి చూసినప్పుడే సామాజిక కవిత్వం వస్తుందన్నారు . యూనివర్సిటీ స్థాయిలో శ్రీ శ్రీ కళావేదిక సంయుక్తంగా కవి సమ్మేళనం నిర్వహించడం ఒక గొప్ప సువర్ణావకాశం అన్నారు . తొలుత జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సెట్రాజ్ సి.ఇ.ఓ యం. భాను ప్రకాష్ మాట్లాడుతూ కవులు సామాజిక ఇతివృత్తాలతో కవిత్వం రాయాలన్నారు .నేటి వ్యవస్థలో ఇంగ్లీష్ ప్రాధాన్యత ఎక్కువ ఉందన్నారు . అనంతరం కవులు తమ కవితా గానాన్ని వినిపించారు . ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక ఛైర్మెన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాధరావు , సెట్రాజ్ సి.ఇ. ఓ భాను ప్రకాష్ ,లను సన్మానించారు. అనంతరం కవులందరికి మెమెంటో శాలువా , పూలదండతో సత్కరించారు .